ఈ శ్రీమంతుడి ఆలోచనలు భావి తరాలకు మార్గదర్శకాలు...
తమిళనాడుకు చెందిన అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ సిలికాన్ వ్యాలీలో Zoho Corporation పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు. మాథాలంపరై గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్పై తిరుగుతున్నారు. పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం. లాక్డౌన్లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 25 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు చేరింది. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ తరగతులు చెప్పిస్తున్నారు.ఇప్పుడు అది ఇక ఎంతమాత్రం ప్రయోగం కాదని శ్రీధర్ వెంబు చెబుతున్నారు. త్వరలో ఆయన సరికొత్త ఎడ్యుకేషన్ స్టార్టప్ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీధర్ అంచనా ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో 8,000 టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, ఇకపై గ్రామాలు.. పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించమే కాకుండా అత్యాధునిక వసతులో హాస్పిటళ్లు నిర్మించడం, సాగునీటిని అందించడం, మార్కెట్లు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆవిధంగా ఆయన తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారు.
ప్రేమ లక్ష్మీనారాయణ్ అనే వైద్యురాలు ట్విటర్ ద్వారా ఈ వివరాలను తెలిపారు. శ్రీధర్ వెంబు ఉదారతను పొగుడుతూ ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. శ్రీధర్ గొప్పదనాన్ని కీర్తిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది తాము చేస్తున్న చిన్న చిన్న మంచి పనుల గురించి వివరించారు.‘దేశంలో ఎన్ని వార్తా ఛానెళ్లు దీని గురించి వార్తలు వేస్తున్నాయో, ఎంత మంది రిపోర్టర్లు దీని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు.. కానీ, ఇలాంటి వాళ్లు ఉండబట్టే దేశం ఇంకా సరైన దారిలో నడుస్తోంది’ అని డాక్టర్ ప్రేమ లక్ష్మీనారాయణ అన్నారు. 2020 జనవరిలో ఆరెస్సెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్రీధర్ వెంబు ట్విటర్లో ట్రోలింగ్కు గురయ్యారని ప్రేమ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం తన వ్యక్తిగత వ్యవహారం అని ఆయన వివరణ ఇచ్చారని వెల్లడించారు. లక్షల రూపాయల సంపదను కోట్లుగా, కోట్ల రూపాయలను వందల కోట్లుగా మార్చే పనిలో చాలా మంది తీరిక లేకుండా గడుపుతున్న ఈ సమాజంలో శ్రీధర్ లాంటి వ్యక్తులు అరుదే కదా! నిజానికి గొప్పగా సంపాదించిన వాడు ఎప్పటికీ శ్రీమంతుడు కాలేడు. ఉన్నత విలువలు, సేవాగుణం ఉన్నోడే శ్రీమంతుడు. తాను పుట్టిన మూలాలు మరచిపోకుండా కోట్లాది సంపదను మాతృభూమి రుణం తీర్చుకోవడానికే వెచ్చించాలని నిర్ణయం తీసుకోవడంతోనే శ్రీధర్ ఎంతటి ‘శ్రీమంతుడో’ అర్థమవుతోంది. ఆయన తన కలలను సాకారం చేసి మరిింత మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.