ఆన్ లైన్ లో ఉద్యోగ నియామకాలు..
పాఠశాల విద్య శాఖలో ఖాళీలను ఆన్ లైన్ లో భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్దం చేసింది. ఈ ప్రక్రియలో 704 ఖాళీలను భర్తీ కానున్నాయి. వాటిలో ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ పోస్టులు 383 , ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోస్టులు 144 , సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు 12 , అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు 27 , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 138 భర్తీ కానున్నాయి. దీనితో చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరనున్నది. డిసెంబరు 23న మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్) కోఆర్డినేటర్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్'లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 20 నుంచి 26 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలను పాఠశాల విద్యాశాఖ డిసెంబరు 12న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23, 24 తేదీల్లో ఆన్లైన్ విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా డిసెంబరు 24న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకు రాతపరీ నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి రోజు రెండు సెషన్లలో, రెండో రోజు ఒకే సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు.