
నేనే తెలంగాణకు ఆఖరి రెడ్డి సీఎం.. రేవంత్ రెడ్డి సంచలనం?
నేనే తెలంగాణకు ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనపై లేని అపోహలను సృష్టించి తప్పుల తడక అని చెప్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి..నిజం నిప్పులాంటి అది వారినే దహిస్తుంది తప్ప ప్రజలకు నష్టం కలిగించదని.. మహాత్ముడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. సోనియా గాంధీ మాట ఇస్తే శిలా శాసనం అని ఆనాడు తెలంగాణ ఏర్పాటుచేసి నిరూపించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నాం..
సాంకేతికంగా, న్యాయ పరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాం.. 150 ఇండ్లను ఒక యూనిట్ గా చేసి ఎన్యుమరేటర్లను నియమించి కులగణన నిర్వహించాం.. కులగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలింది.. ఈ లెక్క నాకోసం చేయలేదు.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా మా నాయకుడి ఆదేశాలను పాటించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
త్యాగానికి సిద్ధమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహించాం.. కులగణనలో ఒక్క తప్పు లేదు… వాళ్లు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేం తీసుకున్నాం.. జనజీవన స్రవంతిలో కలవని వారికి కూడా మళ్లీ అవకాశం ఇచ్చాం.. ఇది మా నిబద్ధతకు నిదర్శనం రాహుల్ గాంధీ మోదీ మెడలు వంచుతారనే కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మోదీ బీసీ కాదు… ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ.. ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం.. 2001 లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు.. ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు .. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలి .. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే..వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. మేం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు.. అలాంటి వారి మాటలు నమ్మొద్దు.. త్వరలోనే దీన్ని చట్టం చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.