జగన్‌ పేరు వినిపించొద్దు.. జగన్‌ ఫోటో కనిపించొద్దు.. బాబు ఆర్డర్‌?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మారింది. మరి అధికారం మారినప్పుడు పథకాలు, విధివిధానాల రూపు రేఖలు కూడా మారుతూనే ఉంటాయి. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు సర్కారు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా జగన్ పేరు కనిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. ఎక్కడా జగన్ ఫోటో కనిపించ కూడదని ఆర్డర్‌ వేసింది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గ్రామవార్డు సచివాలయాల, మీ సేవా కేంద్రాల్లో ధృవీకరణ పత్రాల జారీ విషయంలో చంద్రబాబు సర్కారు  మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి  లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. పాస్ పుస్తకాలు, దృవీకరణ పత్రాలు, ఇతర పత్రాల్లో ఎలాంటి ఫోటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.

2019-24 మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమేరకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించిన చంద్రబాబు సర్కారు.. గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచించింది.  కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకూ సదరు పథకాల జనరిక్ పేర్లను కొనసాగించాలని స్పష్టం చేసింది. పార్టీ రంగులతో, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్దిదారుల పుస్తకాలు, ధృవీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా చంద్రబాబు సర్కారు ఆదేశాలు ఇచ్చింది.
 
ధృవీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ చంద్రబాబు సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసింది. ఈమేరకు కార్యదర్శులు, హెచ్ఓడీలకు చంద్రబాబు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారే సంస్కృతి మారాలి. అసలు పథకాలకు సొంత పార్టీ నేతల పేర్లు పెట్టడంతోనే ఈ సమస్య వస్తుంటుంది. పథకాలకు తమ సొంత పేర్లు పెట్టుకునే సంస్కృతిపోతేనే ఈ సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: