రేవంత్‌ రెడ్డి బాటలోనే చంద్రబాబు.. తగ్గేదేలే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో అతి ముఖ్యమైనది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది.

వీటిలో ఎది మన రాష్ట్రంలో అమలుకు వీలుగా ఉంటుందో అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చి నివేదికను తయారు చేశారు. దీని ప్రకారం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ర్టా పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి.

అలాగే విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేక పాత ఉమ్మడి జిల్లాకు పరిదిలో ఉంటుందా లేక రాష్ట్రమంతా  ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం కల్పిస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి జీరో టికెట్ ను  జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన టికెట్లను లెక్కగట్టి వాటిని రీయింబర్స్  చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది.

ఏపీలో ప్రస్తుతం టికెట్ల ద్వారా నెలకు రూ.500 కోట్లు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే  నెలకు సుమారు రూ. 200 కోట్ల వరకు రాబడి తగ్గుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు రూ.125 కోట్ల వరకు ప్రభుత్వానికి ఇస్తుంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ.125 కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన రూ.75 కోట్లను ప్రభుత్వం నుంచి రీయింబర్స్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏపీలో ఎలాంటి విధానాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: