వైసీపీ విక్టరీ: దేశ రాజకీయాల్లో కొత్త మలుపు?

జగన్‌ గెలిస్తే దేశమంతా ఆలోచిస్తుంది
సంక్షేమానికి ప్రాధాన్యత పెరుగుతుంది
మానవాభివృద్ధి గీటురాయిగా మారుతుంది
వైసీపీ మళ్లీ గెలిస్తే అది దేశ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీస్తుంది. ఇప్పటి వరకూ దేశం ప్రతి నాయకుడు.. ఐదేళ్లు పాలించాక.. నేను ఈ అభివృద్ధి చేశాను.. ఈ నగరం కట్టించాను.. ఆ ఫ్యాక్టరీ తెప్పించాను.. అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో తాను చేసిన  అభివృద్ధినే ప్రధానంగా ప్రస్తావించేవారు.. కానీ.. ఇందుకు వైసీపీ మినహాయింపుగా నిలిచింది. అభివృద్ధి నిర్వచనాన్నే మార్చేసింది.

అభివృద్ధి అంటే నగరాలు, రోడ్లు, భవనాలు కాదు. అభివృద్ధి అంటే సామాన్యుడి ముఖంలో చిరునవ్వు అని జగన్‌ మనస్ఫూర్తిగా నమ్మాడు. దాన్నే తన ఐదేళ్ల పాలనలో అమలు చేశాడు. జగన్ పాలనలో ఉద్యోగుల జీతాలైనా ఆలస్యంగా వచ్చాయేమో కానీ.. అవ్వా, తాతల పించన్లు మాత్రం ఎప్పుడూ ఆలస్యం కాలేదు. సంక్షేమ పథకాల బటన్ మాత్రం ముందు నిర్ణయించిన సమయానికే నొక్కారు.

వైసీపీ గెలిస్తే.. జగన్‌ చెప్పినట్టు దేశమంతా ఓసారి ఏపీ వైపు చూస్తుంది. జగన్‌ విజయంపై పరిశోధన మొదలవుతుంది. ఇలా కూడా ఎన్నికలు గెలవవచ్చా.. జనం సమస్యలకు పరిష్కారాలుగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చా అన్న ఆలోచన మొదలవుతుంది. ఇప్పటికే జగన్‌ సర్కారు చేపట్టిన ఎన్నో పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడం ప్రారంభించాయి. జగన్‌ మళ్లీ గెలిస్తే.. ఆ పథకాల జోరు మరింత పెరుగుతుంది.

ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలను కేవలం డబ్బు పంచే పథకాలుగా దుష్ప్రచారం జరిగింది. సంక్షేమ పథకాలంటే సామాన్యుడికి ఊతం. సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన మానవాభివృద్ధి జరిగినట్టు. ఓవైపు సమాజంలో కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే.. కనీస విద్య, వైద్య సదుపాయాలు అందక ఇక్కట్లు పడుతుందే.. ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందా.. ఈ ప్రశ్నలకు దేశం వైసీపీ గెలుపుతో సమాధానం వెతుకుతుంది. అందుకే వైసీపీ మళ్లీ గెలిస్తే.. దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయి. సంక్షేమం వైపు పార్టీలు సీరియస్‌గా ఆలోచిస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: