ఆ పథకాల నిధుల ఆపివేత.. ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం?

తెలంగాణలో రైతు భరోసా నిధులను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. రైతు బీమా, రైతు భరోసా పథకం కింద 7,624 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొందరు దురుద్దేశంతో సీఎంపై ఈసీకి ఫిర్యాదు చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు రైతుల ఖాతాలో నగదు జమ చేయలేకపోయామని చెప్పారు. దీనిపై తాజాగా రాజకీయ దుమారం చెలగేరింది.


వరంగల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..కుట్ర పన్ని.... రైతు భరోసా నిధులను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఈసీకి ఫిర్యాదు చేశాయని ఆరోపించారు. రైతు భరోసా నిధులను ఆపిన వారి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులుపడేసమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కర్షకుల నోట్లో మట్టి కొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రైతుభరోసాని నిలుపుదల చేయించి బీజేపీ రైతుల నోటి కాడి ముద్దను లాగేసిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ కూడా మండిపడ్డారు.  రైతుల నోటికాడ బుక్కను భాజపా లాక్కుందని.. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.


రైతుబంధు నిధులను బీఆర్‌ఎస్‌ అడ్డుకుందన్న ఆరోపణలను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఈసీకి  ఫిర్యాదు చేయించి నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే రైతు భరోసా నిధులను బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్ర చేసి ఈసీకి ఫిర్యాదు చేశాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఎన్ని ఆడ్డంకులు సృష్టించినా రైతులకు చేరాల్సిన నిధులు చేరతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర చేసి ఈసీకి ఫిర్యాదు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌ చేసిన ఆరోపణను తిప్పికొట్టిన బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డినే ఈసీకి ఫిర్యాదు చేయించి తమపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. అయితే ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులే గడువు ఉంది. మరి  రైతు భరోసా నిధులు జమ అంశం రాజకీయంగా ఎవరి కొంప ముంచుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: