ఏపీ: రాజధాని లేని రాష్ట్రంగా ఈ అప్రదిష్ట ఇంకెన్నాళ్లు?

దేశంలో మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని దుస్థితి ఆంధ్రుడిది. విభజన తర్వాత రాజధాని ఎంపిక ప్రక్రియలో జరిగిన లోపాలు.. ఆ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈ దుస్ధితికి కారణమయ్యాయి. విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో రాజనీతిజ్ఞత చూపలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో అన్ని వర్గాలు, పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా.. నిపుణుల సలహాలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడమే ఆ తర్వాత అనేక మలుపులకు కారణమైందన్న విమర్శలు ఉన్నాయి.

విభజన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన సూచనలన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కడంతో అసలు కథ ప్రారంభమైంది. నిపుణుల సలహాల బట్టి కాకుండా.. తమకు అనుకూలమైన వారి కోసం.. తమ రాజకీయ లబ్ది కోసం.. తమ ప్రతిష్ట కోసం ఏకంగా 30 వేల ఎకరాల్లో గ్రీన్‌ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మించాలని తలపెట్టడం వివాదాలకు కారణమైంది. ఇదంతా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ తరహా కుంభకోణమని వైసీపీ ఆరోపించింది.

రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన చంద్రబాబు సర్కారు తన ఐదేళ్ల హయాంలో కొన్ని భవనాల నిర్మాణం మినహా ఏమీ చేయలేకపోయింది. ప్రాజెక్టు రిపోర్టులు, గ్రాఫిక్స్ వీడియోలతోనే కాలం వెళ్లబుచ్చింది. దీంతో తాను అధికారంలోకి వచ్చాక రాజధాని అంశంపై పునరాలోచన చేసేందుకు జగన్‌కు అవకాశం దక్కింది. చంద్రబాబు ఐదేళ్లలో కనీన స్థాయిలో రాజధాని నిర్మించి ఉన్నా.. జగన్‌ పునరాలోచన చేసేందుకు సాహసం చేసేవాడు కాదన్నది అందరూ అంగీకరించే వాస్తవం.

జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా మూడు రాజధానుల పాట అందుకున్నాడు. ఆ తర్వాత ఏ ఒక్క ప్రాంతాన్ని రాజధాని చేయలేకపోయాడు. ఉన్న అమరావతిని అటకెక్కించి విశాఖను రాజధానిగా చేయాలనుకున్నాడు. కానీ న్యాయపరమైన ఇబ్బందులతో అదీ  పూర్తి కాలేదు. ఇప్పుడు ఆంధ్రావాళ్ల రాజధాని ఏదీ అంటే.. అటు అమరావతి అని చెప్పలేని దుస్థితి.. ఇటు విశాఖ అని చెప్పుకోలేని పరిస్థితి. మరి వచ్చే కొత్త ప్రభుత్వమైనా రాజధాని సమస్యను తీరుస్తుందా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: