చంద్రబాబు: మే1 తలచుకుంటేనే వణుకు మొదలవుతోందిగా?

చంద్రబాబును పెన్షన్ల టెన్షన్‌ ఇబ్బంది పెడుతోంది. వాలంటీర్లను ఈ పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించాలని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రాసిన లేఖతో చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ లేఖ ఆధారంగా ఈసీ వాలంటర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. దీన్ని వైసీపీ బాగా వాడుకుంది. మొత్తానికి గత నెలలో పెన్షన్లు సకాలంలో అందక వృద్ధులు బాగా ఇబ్బంది పడ్డారు. అది టీడీపీకి బాగా మైనస్ అయ్యింది.

దీంతో చంద్రబాబు మేలుకున్నారు. ఇదే పరిస్థితి మళ్లీ మేలోకూడా వస్తే అది టీడీపీకి పెద్ద మైనస్‌ పాయింట్ అవుతుంది. అందుకే ముందుగానే దిద్దు బాటు చర్యలు ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబు లేఖను ఈసీ అధికారులకు పార్టీ జాతీయ సమన్వయకర్త కనకమేడల రవీంద్ర కుమార్ అందించారు. పెన్షన్ లబ్దిదారులకు మే నెల పెన్షన్ వారి ఇంటి దగ్గరే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అందించిన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తగిన  ఏర్పాట్లు చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని  చంద్రబాబు లేఖలో కోరారు. పెన్షన్ల పంపిణీ కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు కనిపించడం లేదని లేఖలో పేర్కొన్న టిడిపి అధినేత చంద్రబాబు.. ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డు పెట్టుకొని పెన్షన్ దారులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులు గురిచేసిందని పేర్కొన్నారు.
 
ఏప్రిల్ లో పెన్షన్ల పంపిణీ కి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం తో దాదాపు 33 మంది పెన్షనర్లు ఎండ వేడికి తట్టుకోలేక మృతి చెందారు. వైసిపి దుర్మార్గపు ఆలోచనలతో, రాజకీయ ప్రయోజనాల కోసం పెన్షనర్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ నెలలో ప్రవర్తించిన విధంగానే... ఇప్పుడు కూడా అదే ప్రదర్శిస్తున్నారని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి... జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు లేఖలో  పేర్కొన్నారు. అందుకే పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: