చంద్రబాబు, పవన్: ఒక్కసారి కూర్చుని మాట్లాడుకోండయ్యా?
జగన్ లక్ష కోట్ల రూపాయల అవినీతి చేశారు అంటే అది నిజమో.. అబద్ధమో ఎవరకీ తెలియదు. కానీ ఎల్లో మీడియా మాత్రం జగన్ రూ.లక్ష కోట్లు దోచేశారు. అంటూ వార్తా కథనాలు ప్రచురించింది. ఇది జనాల్లోకి కూడా బాగా వెళ్లింది. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒక్కసారిగా రూ.లక్ష కోట్ల నుంచి రూ.20వేల కోట్లు జగన్ దోచుకున్నారు అమాంతం ఆ డబ్బులను తగ్గించేశారు.
ఎందుకుంటే చంద్రబాబు ఏమో కొండకి నిచ్చెన వేస్తారు. పవన్ మాత్రం నేలమీద నిచ్చెన వేసి నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. రెండింటికి పొంతన కుదరడం లేదు. అందుకే ఓసారి చంద్రబాబుతో కూర్చొని మాట్లాడితే జనసేనాని మైండ్ ను ఆయన మార్చేస్తారు. జనసేన అధినేత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రూ.20వేల కోట్లు దోచుకున్న జగన్ పేదవాడా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అధికారంలో ఉండి మద్యం, ఇసుక, ఇతర లావాదేవీల మీద రూ.20వేల కోట్లు సంపాదించి ఉండరంటే సగటు ప్రజలే కాదు వైసీపీ నాయకులు కూడా నమ్మరు. ఇదే సందర్భంలో చంద్రబాబు అంతకు ముందు ప్రభుత్వంలో అమరావతి, ఇసుక తదితర వాటిపై ఇంతకన్నా ఇంకా ఎక్కువే సంపాదించి ఉండొచ్చు కూడా. ఇది పక్కన పెడితే గతంలో జగన్ అరెస్టు అయింది రూ.1500 కోట్ల విషయమై. కానీ చంద్రబాబు దానికి రూ.లక్ష కోట్లు అని చెప్పి ప్రజలను నమ్మించగలిగారు. ఇప్పుడు మళ్లీ రూ.20వేల కోట్లు అంటే వినడానికి చిన్నదానిలా ఉంది. అందుకే పవన్ ఓ సారి చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ విమర్శకులు సూచిస్తున్నారు.