రేవంత్‌ రెడ్డి: సేమ్‌ టు సేమ్‌ కేసీఆర్‌ చేసిన తప్పులే చేస్తున్నాడుగా?

టీపీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంలో పాటు ప్రభుత్వ స్థిరీకరణ అనే కాన్సెప్ట్ ను ఏక కాలంలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు అధిష్ఠానం కూడా గేట్లు ఎత్తినట్లు తెలుస్తోంది. దీంతో నాయకులు పోలోమంటూ అక్కడ అభ్యర్థిత్వాలను కాదని మరీ వచ్చి చేరుతున్నారు.

ఇలా చేరిన వారిలో కొంతమందికి ఎంపీ సీట్లు కేటాయిస్తుండగా.. చాలామందికి నామినేటేడ్ పోస్టులు, భవిష్యత్తులో పార్టీ పదవులు.. ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేరేవారే ఉంటున్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం ఏటికి ఎదురీది గెలిచింది. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కూడా గతంలో కాంగ్రెస్ ను ఓడించేందుకు సర్వ శక్తులూ ఒడ్డిన వారే. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ స్థిరత్వం పేరిట ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా ప్రజలు అంగీకరించారు.

ఇదే క్రమంలో అంతకు మించి మెజార్టీని 2018 ఎన్నికల్లో అందించారు. అయినా కేసీఆర్ ప్రతిపక్షం ఉండకూడదు అనే భావనతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఫలితం బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఏర్పడింది. అప్పట్లో కేసీఆర్ ని తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా చేర్చుకుంటారు అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఈ సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారు.. భవిష్యత్తే ఉండదని భావించినా. పార్టీని నమ్ముకొని వదిలిపెట్టని వారు ఉన్నారు. ఇప్పుడు ఎడాపెడా చేరికలను ప్రోత్సహిస్తే వారంతా అన్యాయానికి గురైనట్టే. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు ఎంతమంది విజయం సాధించారో మనం చూశాం. ప్రస్తుతం బీఆర్ఎస్ ను బలహీనం చేయవచ్చు. కానీ ఈ వ్యూహం బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ ను కూడా బలహీన పరుస్తుందో చూడాలి. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ ను చేరదీస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: