ఏపీలో ఎన్నికల యుద్ధం.. ఇదేం దిగజారుడు?
గతంలో ఎన్నికలు అభివృద్ధి ఎజెండాపై జరిగేవి. మేం అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. ప్రస్తుత పార్టీ అరాచకాలు ఇవిగో అంటూ చూపించేవారు. విమర్శలు హుందాగా ఉండేవి. కానీ ఈ దఫా ఎన్నికలు ఎదుటి వారు మంచోడు కాదు. అందుకే మాకు ఓటేయ్యండి అనే కొత్త రాగం అందుకున్నారు. అలాగే ఈ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కూడా ఈ విధమైన పోస్టులే పెడుతున్నారు.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ సోషల్ మీడియా మేం ఇది చేశాం. అభివృద్ధిని కొనసాగించాలంటే మాకు ఓటేయ్యండి అనే తరహాలో పోస్టులు పెట్టేవారు. దీనికి ప్రతిగా వైసీపీ కూడా టీడీపీ ఇచ్చిన హామీల్లో అమలు చేయనవి.. చేసిన పనుల్లో లోపాలను ఎత్తి చూపుతూ పోస్టులు పెట్టేవారు. అది ఫర్వాలేదు. ఇవి నిర్మాణాత్మ కంగా ఉండి విద్యావంతుల్ని చైతన్య పరిచేలా ఉండేవి.
కానీ ఈ సారి ఆయా పార్టీల సోషల్ మీడియా నిర్వాహకుల పోస్టులు శ్రుతి మించుతున్నాయి. మీమ్స్ పేరుతో ప్రారంభమైన పేజీలు రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే.. ఆయా రాజకీయ నాయకుల భార్యల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉంటున్నాయి. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అనే తరహాలు ఒకరికి మించి మరొకరు పోస్టులు పెడుతున్నారు. ఇవి ఏ స్థాయికి చేరాయంటే ఏకంగా అక్రమ సంబంధాలు అంటగట్టి రాక్షసానందం పొందుతున్నారు. ఈ పోస్టులు అటు వైసీపీ నాయకులకు.. ఇటు టీడీపీ నాయకులకు తెలిసినా.. అదుపులో పెట్టడం లేదు. తద్వారా వాళ్ల నాయకుల పరువు, మర్యాదలను వీళ్లే దిగజార్చుతున్నారు. ఈ విషయం వీరికి అర్థం అవుతుందో లేదో తెలియడం లేదు.