కేసీఆర్ ఎంట్రీతో.. రేవంత్ సీన్ మారిపోతుందా?
అయితే ప్రస్తుతం పార్టీ బాధ్యతల్ని కేటీఆర్ చూసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలపై సమాయత్తం అవుతున్నారు. లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఇప్పుడే మేం అడిగిన ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్నారని మా అధినేత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడితే సీన్ వేరే ఉంటుందని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. అనూహ్యంగా కాలు జారి కిందపడటంతో తుంటి ఎముక విరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా శాసన సభలో అడుగు పెడతారు. అప్పుడు కేసీఆర్ ను ఎదుర్కోలేరని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ను గద్దె దించడం రేవంత్ రెడ్డి చిరకాల కోరిక అని చెప్పవచ్చు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష స్థానంలో చూడాలని రేవంత్ ఉవ్విళూరుతున్నారు. సీఎం కూడా తన సినిమా కేసీఆర్ కు చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత అసెంబ్లీ సెషన్ లో అర్థం అయింది. అందువల్ల రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చూసి ఉలిక్కిపడరు.. పులకరించిపోతారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో వీరిద్దరి మధ్య ఫైట్ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.