పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ తప్పదా?
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకొని తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే క్యాడర్లో నిరుత్సాహంతో పాటు కొంత ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుంది అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికలు హస్తం పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కీలకం. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించకపోతే పార్టీలు అలజడులు రేగడం ఖాయం.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ తో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ మేం గేమ్ మొదలు పెట్టం. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు ప్రారంభిస్తే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చెప్పలేం అంటూ హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ ను ముక్కలు చేస్తాం.. ఎంపీ ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని ఖాళీ చేస్తారు అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పూర్తి కాలం అధికారం ఉండదు అని చెబుతున్న బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ గా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.