బాబు నారాయణ, చైతన్య - జగన్ బైజూస్?
డిజిటల్ విద్య కోసం బై జ్యూస్ తో ప్రభుత్వం 600 కోట్లతో ఒప్పందం చేసుకుందని అంటున్నారు. మూడేళ్లలో విద్య కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం వైసీపీప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలకు రాబోయే రోజుల్లో శ్రీకారం చుడతారని వైసీపీ నాయకులు అంటున్నారు. తెలుగు దేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో కార్పోరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వవిద్యా సంస్థలను నిర్వీర్యం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేలా చంద్రబాబు చట్టాలు తెచ్చారని మంత్రి ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అలాంటివి చేయలేదని.. అంటున్నారు. విద్యారంగంపై వైసీపీ ప్లీనరీ లో చేపట్టిన తీర్మానం పై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. మూడేళ్లలో విద్యారంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని గుర్తు చేశారు. అమ్మఒడి పథకం అమలు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని, వసతి దీవెన, విద్యా దీవెన సహా పలు పథకాలు అమలుచేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదని, పేదల తలరాతను మార్చేలా సీఎం ముందుకు వచ్చారని గుర్తు చేశారు.