జగన్పై దుష్ప్రచారం.. భలే తెలివిగా చేస్తున్నారే..?
ఇక దీనికి తోడు మరో ప్రచారం కూడా మొదలైంది. అయితే ఈ ప్రచారం చాలా తెలివిగా జరుగుతోంది. ఆ ప్రచారం ఏంటంటే.. ఎవరికీ లేని ఆంక్షలు భీమ్లానాయక్ కే ఎందుకు.. ఒక్క పవన్ కల్యాణ్ సినిమాకే ఇన్ని ఆంక్షలు ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం.. భారతీ సిమెంట్కు లేని ఆంక్షలు.. భీమ్లా నాయక్కు ఎందుకు అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఇదే మాట చాలా మంది పవన్ సపోర్టర్లు ప్రశ్నిస్తున్నారు. నిన్న నాగబాబు కూడా ఇదే మాట అడిగారు.
అయితే.. దీనికి సమాధానం కూడా జగన్ టీమ్ వద్ద ఉంది. జగన్ పని కట్టుకుని పవన్ కల్యాణ్ సినిమా కోసం కొత్త రూల్స్ రూపొందించలేదని వారు చెబుతున్నారు. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమా కంటే ముందు... బంగార్రాజు, పుష్ప, అఖండ వంటి సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఆ సినిమాలకూ ఇవే రూల్స్ వర్తించాయి.. ఆ సినిమాలకు కూడా టికెట్ ధరలు ఇవే ఉన్నాయి. ఆ సినిమాలకు కూడా ప్రత్యేకమైన షోలకు అనుమతించలేదు. ఆ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు వేయనివ్వలేదు.
మరి అలాంటప్పడు ఒక్క బీమ్లానాయక్ కు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు అని ఎలా ప్రశ్నిస్తారు. అంటే.. ఇంత లోతుగా ఆలోచించని వారు.. బీమ్లానాయక్ పై జగన్ కక్ష కట్టారు కాబట్టే ఇలా చేస్తున్నారని నమ్మించడం చాలా సులభం కాబట్టి.. ఈ వాదనను తెరపైకి తెస్తున్నారని అనుకోవాలి.