వైఎస్ స్మృతిలో: నీ పథకాల్లో బతికే ఉన్నావు..!
అవును.. వైఎస్ పూర్తిగా పేదల పక్షపాతిగా పాలించారు. ప్రతి పేదవాడికీ కార్పొరేట్ తరహా వైద్యం.. అసలు ఇలాంటి ఆలోచనే గతంలో ఏ నేత కూడా చేయలేదు. ఎంతసేపూ సర్కారీ వైద్యం అంటే.. శిథిల ప్రభుత్వాసుపత్రుల్లో మగ్గడం తప్ప మరో ఆలోచనే లేదు. అలాంటిది పేదోడు కూడా దర్జాగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేలా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తెచ్చాడు. ఈ పథకం తెచ్చిన మొదట్లో కార్పొరేట్ ఆస్పత్రులను మేపేందుకే ఈ పథకం తెచ్చాడన్న పార్టీలో తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత వైఎస్కు అంతగా పేరు తెచ్చిన మరో గొప్ప పథకం.. ఫీజు రీఎంబర్స్మెంట్.. పేదోడి పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలన్నది వైఎస్ కల. అందుకే ప్రైవేటు కళాశాలల్లో చదివిన పేదోడి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకం తెచ్చారు. ఈ పథకం పుణ్యమా అని ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు. తమ జీవితాలను మార్చుకున్నారు. ఇక అన్నింటి కన్నా గేమ్ ఛేంజర్ ఉచిత విద్యుత్ పథకం.. ఈ పథకం ప్రకటించగానే.. ఇలా ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేసిన పార్టీలో ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చాక కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో పథకాలు.. అన్నింటిలోనూ ప్రధాన లక్ష్యం పేదోడు బాగుపడటమే. అందుకే వైఎస్సార్ భౌతికంగా లేకపోయినా.. ఆయన్ను స్మరించుకునేవారికి కొదవు లేదు.