ఏపీ, తెలంగాణ నీళ్లలొల్లికి అసలు గుట్టు బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..?

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం మరోసారి పతాకస్థాయికి చేరింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనూ రాని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్లీ సమస్యలు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది కేవలం నీటి వివాదం మాత్రమే కాదని.. దీని వెనుక రాజకీయ కోణం ఉందంటూ ఓ రహస్యాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బయటపెట్టారు.


ఏపీ సీఎం జగన్ చెల్లెలు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమే ఈ జల వివాదానికి అసలు కారణమట. జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు మొదట వార్తలు వచ్చినప్పుడు కేసీఆర్‌ పెద్దగా పట్టించుకోలేదట. అంతా పుకార్లే అనుకున్నారట. తర్వాత షర్మిల సీరియస్‌గా పార్టీ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో కేసీఆర్ కు కోపం వచ్చిందట. చెల్లెలు షర్మిలను అదుపులో పెట్టవలసిందిగా జగన్‌ రెడ్డిని కేసీఆర్ హెచ్చరించారట. జగన్‌ రెడ్డి కూడా చెల్లెలు షర్మిలకు నయానోభయానో నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారట.


ఎంత చెప్పినా షర్మిల తమ మాట వినడం లేదని.. ఆమె తన నిర్ణయం మార్చుకోవడం లేదని కేసీఆర్‌కు జగన్ సమాచారం అందించారట. అయితే జగన్‌ మాటలను నమ్మని కేసీఆర్‌.. జగన్‌ రెడ్డిపై ఒత్తిడిని పెంచారట. ఏపీ ఎన్నికల సమయంలో తాను చేసిన సహాయానికి జగన్‌ రెడ్డికి కనీస కృతజ్ఞత చూపడం లేదని.. సోదరి షర్మిలను జగన్ కావాలనే తమపైకి ఉసిగొల్పుతున్నారని  కేసీఆర్‌  ఫీలయ్యారట. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వల్ల తమకు నష్టం జరుగుతుందన్న అంచనాకు వచ్చిన కేసీఆర్.. జగన్‌ రెడ్డిపై మరింత ఒత్తిడి పెంచడానికే ప్రధాన రిజర్వాయర్ల నుంచి గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తికి ఉత్తర్వులు జారీ చేశారట.


షర్మిలను నిలువరించడానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కేసీఆర్‌కు నచ్చజెప్పడానికి మరోసారి జగన్ రెడ్డి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట. కేసీఆర్‌కు కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా ఆయన తన తల్లి విజయలక్ష్మి ద్వారా షర్మిలకు చెప్పించినా ఆమె పట్టువీడలేదట. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్న నీటి వివాదాల అసలు కారణం. ఎంత వరకూ నిజమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: