హరీశ్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. ఏమవుతుందో?

frame హరీశ్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. ఏమవుతుందో?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో సాగుతోంది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్‌ టాపింగ్ కేసుపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హరీష్‌ రావు పిటీషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు వినిపించిన సిద్దార్థ్ లూద్రా.... కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని.... పిటీషన్‌ను కొట్టివేయాలని కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాజీ మంత్రి హరీష్‌ రావు అధికారాన్ని దుర్వినియోగం చేశారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూద్రా కోర్టుకు తెలిపారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీష్‌ రావు.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని పోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని లూద్రా వాదించారు. ఇంటిలిజెన్స్‌ అధికారులను ఉపయోగించుకొని చక్రధర్‌ గౌడ్ ఫోన్‌ టాపింగ్ చేయించడంతో పాటు.. ఆయన కదలికలను తెలుసుకొని ఇబ్బందులకు గురి చేశారని లూద్రా హైకోర్టుకు తెలిపారు.

 పిటీషనర్ హరీష్‌ రావు తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష్య కారణంగానే పంజాగుట్ట పోలీసులు అక్రమ కేసు బనాయించారని ఆయన వాదించారు. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్‌ గౌడ్‌కు నేర చరిత్ర ఉందని... అలాంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి దర్యాప్తు చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. చక్రధర్‌ గౌడ్‌ పై పలు కేసులున్నాయని.... ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన కేసులున్నాయన్నారు.

అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రాజకీయంగా రాణించాలనుకున్నారని... ఇందులో భాగంగా బీజేపీలో చేరారని... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టికెట్‌ రాకపోవడంతో బీఎస్పీలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదని శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.

ఈ పిటీషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసిన  హైకోర్టు హరీష్‌ రావును అరెస్ట్ చేయొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించింది. ఇదే కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: