మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మల్కాజ్గిరి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల్లో గోల్మాల్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పీఎస్ లో అజారుద్దీన్ తో పాటు మరికొంత మందిపై గతంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అజారుద్దీన్ మల్కాజ్గిరి కోర్టును ఆశ్రయించారు. ఉప్పల్ స్టేడియంలో జిమ్తో పాటు, బంతుల కొనుగోలు, కుర్చీల ఏర్పాటులో అక్రమాలకు పాల్పడ్డానంటూ నమోదైన కేసులో వాస్తవం లేదని అజారుద్దీన్ తరఫు న్యాయవాది మల్కాజ్గిరి కోర్టుకు తెలిపారు.
ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు అజార్ కు 41ఏ నోటీసులిచ్చి ప్రశ్నించాలని ఉప్పల్ పోలీసులను ఆదేశించింది. అజారుద్దీన్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అజారుద్దీన్ ఊపిరి పీల్చుకున్నారు.