ఏమన్నా అర్థమవుతోందా.. మీకు?
ఈనెల 27వ తేదీన రైతులకు మద్దతుగా ఈనెల 27వ తేదీన వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర పార్టీలు భారత్బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడమే ఇప్పుడు విశేషంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 650 రోజులుగా ధర్నాచేస్తోన్న రైతులను పట్టించుకోరు.. వారి ఇబ్బందుల గురించి మాట్లాడరు.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలవుతున్నా ఇంతవరకు వారికి కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు... ఒకసారి ఇస్తే తమ సమస్యలు చెప్పుకుంటామని రైతులు చెబుతున్నారు. అవేమీ లేకుండా కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతివ్వడమనేది హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు మద్దతు పలుకుతున్న భారత్బంద్కు వైసీపీ ఎలా మద్దతిస్తుందని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నిస్తున్నారు. బంద్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.