65 గంటలు.. 24 సమావేశాలు..!!
నాలుగు రోజుల అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీగా గడిపారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో పాల్గొన్నారు. విమానంలోనూ ఆయన నాలుగు మీటింగ్స్లో పాల్గొన్నారు. మొత్తం సమావేశాల సంఖ్య 24కు చేరాయి. అమెరికా పర్యటన తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా వెళ్లే సమయంలో ఈ నెల 22న విమానంలో ప్రధాని మోదీ రెండు సమావేశాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాషింగ్టన్లో దిగిన వెంటనే మరో మూడు సమావేశాలు జరిగాయి. 23న అమెరికాలోని ఐదు కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత తన అంతర్గత టీమ్తో మరో మూడు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తోపాటు క్వాడ్ సమావేశంలో పాల్గొనే ముందు మరో నాలుగు అంతర్గత సమావేశాల్లో కూడా ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ నెల 25న ఇండియాకు తిరిగి రావడానికి విమానంలో ఎక్కిన ఆయన.. మరో రెండు సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేశారు.