ఏపీ: ఇంగితజ్ఞానం లేదా... జగన్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన షర్మిల..??

Suma Kallamadi
ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలతో పాటు వైఎస్ సునీతను జగన్ మోహన్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. పులివెందులలో మాట్లాడిన జగన్ పచ్చ చీర కట్టుకొని ఎల్లో బ్యాచ్ లో షర్మిల కలిసిపోయారు అంటూ ఆరోపించారు. వారి రంగు అసలు రంగు అదే అంటూ తనదైన శైలిలో ఏకిపారేశారు. దీంతో షర్మిల తన అన్న పై రివర్స్ అయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ సొంత చెల్లి గురించి ఇంకిత జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడటం చాలా విచారకరమన్నట్లు ఆమె పేర్కొన్నారు.
 లక్షల మంది చూస్తారని తెలిసి కూడా సొంత చెల్లి బట్టల గురించి అన్నయ్య నీచంగా మాట్లాడటం అసలు బాగోలేదని ఆమె ఫైర్ అయ్యారు. "చంద్రబాబు వద్ద నేను మోకరిల్లానని, ఆయన పార్టీ రంగు అయిన పసుపు చీరను కట్టుకున్నానని, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ను నేను చదువుతున్నానని జగన్ అంటున్నారు. పసుపు రంగు పై చంద్రబాబు ఏమైనా పేటెంట్ హక్కు తీసుకున్నారా? జగన్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నారు, గతంలో సాక్షి పేపర్, టీవీ ఛానల్ పసుపు రంగులో ఉండేవి. పసుపు మంగళకరమైన రంగు అని స్వయంగా వైఎస్ఆర్ చెప్పారు. అందుకే సాక్షి టీవీకి పసుపు రంగు పెట్టారు. పసుపు టీడీపీ సొంతం కాదని ఎప్పుడో స్పష్టం చేశారు. సీఎం హోదాలో, అది కూడా అన్న అయి ఉండి నేను ధరించిన చీర గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఇలాంటి మాటలు సభ్యత లేకుండా ఎలా మాట్లాడుతారు?" అని షర్మిల ఒక రేంజ్ లో జగన్ పై ధ్వజమెత్తారు.
సీబీఐ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపినట్టు ఆధారాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. హంతకుడిని జగన్ ఎందుకు కాపాడుకొస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. "సాక్షి ఛానల్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసింది. వైసీపీ నేతలు అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కోరారు. అధికారంలోకి వచ్చాక వద్దు అన్నారు. మామ రవీంద్ర అవినాష్ రెడ్డి సాక్షాలను తుడిపి వేస్తుంటే చూశారట. వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ కోసం ఆయన ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. మేము నిజాలు మాట్లాడితే మాత్రం మాపై విరుచుకుపడుతున్నారు." అని షర్మిల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: