ఆ విమానానికి తెలంగాణలో స్టాప్ ఉందా?
అధునాతన సీ-295 విమానాల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుందా? దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
వేలమందికి ఉపాధి లభించడంతోపాటు ఇతరత్రా లబ్ధి కలుగుతుందనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ తయారీ ప్రాజెక్టు టాటాలకు దక్కాలని కోరుకుంటోంది. సీ-295 విమానాల కొనుగోలుకు రూ.21వేల కోట్లతో రక్షణశాఖకు ఎయిర్బస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చేదీ లేనిదీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడివుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఎయిర్బస్ 16 విమానాలను స్పెయిన్లో తయారుచేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్లో ఉత్పత్తి చేయించబోతోంది. ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తి కేంద్రం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉండటంతో తెలంగాణకు అవకాశం కనపడుతోంది. ఇటీవల డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చినప్పుడు వైమానిక కారిడార్ల గురించి కేటీఆర్ కోరారు. ఏదేమైనా కానీ తెలంగాణకు అవకాశం రావడంపై పారిశ్రామికవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.