మహిళపై అగ్రవర్ణాల దాడి?
నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం మండలం పాతాళపల్లి గ్రామంలో రజక మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు దాడిచేశారు. బాధితురాలి ఇంటి ఆవరణలో చెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. మహిళ అనే కనికరం లేకుండా ఊరుబిండి పోలిరెడ్డి విచక్షణ రహితంగా ఆమెపై దాడిచేసి కొట్టాడు. పోలిరెడ్డికి మద్దతుగా మరికొందరు కూడా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఏటూరి లక్ష్మమ్మను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై దాడిచేయడానికి కారణాలను తెలుసుకుంటున్నారు. బాధితురాలి బంధువులు నిందితుణ్ని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు. అనంత సాగరం మండలంలో గతంలో కూడా ఈ తరహా ఘటనలు రెండు జరిగాయి. ఒక దళిత యువకుడిపై దాడి, వెనకబడిన వర్గాలకు చెందిన మరో వ్యక్తిపై పొలం గట్టువద్ద వివాదం చెలరేగడంతో దాడిచేసిన సంఘటనలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండగా ఉండటంవల్లే నిందితులు ఇలా రెచ్చిపోతున్నారంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.