వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కేసు పెట్టారు..!!
ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కేసు పెట్టడంపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. డీజీపీ కార్యాలయం గేటును గట్టిగా నెట్టేశారని, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ తాడేపల్లి ఏఎస్ ఐ మధుసూదన్రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, తెనాలి శ్రావణ్కుమార్, జీవీ ఆంజనేయులు, బోడే ప్రసాద్ తదితరులపై కేసు నమోదైంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా? అంటూ ఈ నేతలంతా ప్రభుత్వ తీరుపై, పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కేసు నమోదు చేశారని, దీనిపై కోర్టుకు వెళతామని వీరు స్పష్టం చేశారు. ఏ దేశంలోకానీ, ఏ రాష్ట్రంలోకానీ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినవారిపై కేసు పెట్టరని, అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని ధ్వజమెత్తారు.