మోడీ కోటలో కేజ్రీవాల్?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీకి 2022లో జరగబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరఫున అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించారు. సోమవారం అహ్మదాబాద్లోని ఆశ్రమ్రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ పలు విషయాలను వెల్లడించారు. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సూరత్ లో 27 వార్డులను కైవసం చేసుకుందని, ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేస్తూ జాతీయపార్టీగా మారామని చెప్పారు. తాను గుజరాత్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని, త్వరలో ఆ రాష్ట్ర స్వరూపమే మారబోతోందని, గుజరాత్లోని ప్రజలందరినీ కలుస్తానన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఇసుధన్గాధ్వీ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ఆద్మీలో చేరారు. ప్రజలకు ఎటువంటి పరిపాలన కావాలో అరవింద్ కేజ్రీవాల్కు బాగా అవగాహన ఉందని గాధ్వీ అన్నారు.