దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి ఎగబాకాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా, మరణాల సంఖ్య మాత్రం నాలుగు వేల పైచిలుకు దాటాయి.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,48,371 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా మరో నాలుగు వేలు తగ్గడంతో 3.71 లక్షలకు పడిపోయాయి. ఇక నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో గత 14 రోజుల్లో 50 వేల మంది కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో మొత్తం మృతులు 2.5 లక్షలు దాటారు. మహారాష్ట్రలో మరోమారు మరణాలు పెరిగాయి. గత రెండు రోజులుగా 600 కంటే తక్కువగా నమోదవుతుండగా, ఇప్పుడది 793కు చేరింది. తమిళనాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మరణాలు అధికమయ్యాయి. మొదటి నుంచి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్న మహారాష్ట్రలో రోజువారీ కేసులు తగ్గుతుండగా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో క్రమంగా అధికమవుతున్నాయి.