డీజీపీ గౌతమ్ సవాంగ్కు తెలుగుదేశం సత్కారం??
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను తెలుగుదేశం పార్టీ సత్కరించబోతోందా?.. ఎందుకంటే డీజపీ తమకు కొంత సమయం కేటాయిస్తే సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మొహరించినప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి బలగాల ముందు నిలబడలేకపోయాయని, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, డీజీపీ స్వామిభక్తిని చాటుకున్నారని మండిపడ్డారు. దొంగ ఓటర్లను పట్టించిన తెలుగుదేశం ఏజంట్లపైనే కేసులు పెట్టారు.. తిరుపతి ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలి.. జగన్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని రామానాయుడు కోరారు. దొంగ ఓటర్లను ప్రశ్నించిందుకు శ్రీకాళహస్తిలో ఒక కానిస్టేబుల్ స్థానికులపై ఎలా చేయిచేసుకున్నారో వీడియోల్లో సజీవంగా ఉన్నాయని, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందో దీన్నిబట్టే అర్థమవుతోందని నిమ్మల వ్యాఖ్యానించారు.