బిగ్ బ్రేకింగ్: ప్లాస్మా థెరపీ చేయించుకున్న మొదటి వ్యక్తి మృతి
ప్లాస్మా థెరపీని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే.. ప్రాణాలకే ముప్పు అని కేంద్రం ఇటీవలే హెచ్చరించింది. ఆ హెచ్చరికలే ఇప్పుడు నిజమవుతున్నాయి. తాజాగా ప్లాస్మా థెరపీ చేయించుకున్న 52ఏళ్ల వృద్ధుడు కన్నుమూశాడు. మహారాష్ట్రలో తొలిసారి ఫ్లాస్మా థెరపీ చేయించుకున్న ఈ వ్యక్తి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆ వ్యక్తి సెప్టిసిమియాతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాడని.. ప్లాస్మా థెరపీ చేయించిన తరువాత కాస్త కోలుకున్నాడని అక్కడి డాక్టర్లు తెలిపారు. నిజానికి.. రెండు మూడు రోజుల కిందటే కేంద్రం ఈ ప్లాస్మా థెరపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇటీవల పేర్కొన్నారు.
కరోనా వైరస్ నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని.. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని, దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దని ఆయన చెప్పారు. పేషెంట్కు ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని కూడా లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇటీవల ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తున్నారు. ఈ వార్తతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.