భారత్కు ఏడీబీ ఇచ్చే రుణం ఎంతో తెలుసా..?
భారత్కు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోదం తెలిపింది. 1.5బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ రుణంతో భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టనుంది భారత ప్రభుత్వం. కరోనా పోరులో భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అభ్యర్థన మేరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ప్రధానంగా లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దెబ్బతింటోంది. అనేక రంగాలు దెబ్బతింటున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటూనే.. ప్రజల ఇబ్బందులు తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సమాజంలోని పేద, ఆర్థికంగా బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇచ్చిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడీబీ రుణంలో కేంద్రం మరిన్ని రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.