కరోనాపై యుద్ధం చేస్తున్న ఆ మహిళా ఎమ్మెల్యే
ఏపీలో కరోనా వైరస్ కట్టడికి ఎమ్మెల్యే రోజా యుద్ధం చేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కష్టకాలంలోనే మనం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అంటున్నారు. ఇటీవల ఆమె స్వయంగా పేదలకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె స్వయంగా వంట చేసి పేదలకు ఆహారం అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ప్రజాప్రతినిధులు ఇళ్లకే ఎక్కువగా పరిమితం అవుతున్నా రోజా మాత్రం నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు.
లాక్డౌన్ నిబంధనలను గౌరవించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ప్రణాళికతో కరోనాకు అడ్డుకట్టవేస్తున్నారని పేర్కొన్నారు. కాగా.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే రోజా స్వయంగా వంటలుచేస్తూ.. వీడియోలు చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు.