పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ సర్కారు రద్దు చేసేసింది. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా ఆప్ సర్కారు భద్రతను తొలగించేసింది. మొత్తం 424 మందికి భద్రతను తొలగించింది. వీరిలో రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా అనేకులు ఉన్నాయి. ఈ ఏడాది గత నెలలో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. ఇంకా మాజీ మంత్రులు మన్ప్రీత్ సింగ్ బాదల్, రాజ్ కుమార్ వెర్కా, భరత్ భూషణ్ అషు వంటి వారు కూడా ఉన్నారు. పంజాబ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది పోలీసు స్టేషన్లకు అందుబాటులోకి వచ్చారు.