తక్కువ ఛార్జీతో వోల్వో సర్వీసులు?
పికెట్, జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు సోమవారం నుంచి అతి తక్కువ చార్జీతో లోఫ్లోర్, ఓల్వో బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఆర్ఎం జి.యుగేందర్ తెలిపారు. రాజధాని, గరుడ బస్సులకు దీటుగా 16 ఓల్వో బస్సులను నడుపుతామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయిన తర్వాత తెలంగాణ ఆర్టీసీకి మంచిరోజులు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. ఒకటోతేదీనే ఉద్యోగులందరికీ వేతనాలు ఇవ్వడంతోపాటు వారికి ఇతరత్రా ఏమైనా సమస్యలుంటే స్వయంగా ఆయనే కనుక్కొని వాటిని పరిష్కరించడం, హోదాలతో సంబంధం లేకుండా అందరితో కలివిడిగా ఉండటం ఆర్టీసీలో నూతన ఉత్సహాన్నినింపుతోంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేలనే సంకల్పంతో వోల్వో సర్వీసులను అతి తక్కువ ఛార్జీలతో నడపనున్నారు. ఇది కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరగడానికి ఒక కారణమవుతుందని భావిస్తున్నారు.