ఆంధ్రప్రదేశ్లో సైకోరెడ్డి పాలన నడుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్కరాజుపల్లెలో వైసీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని బుధవారం లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు. బద్వేలులో సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే నవ్వుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. అందుకే జగన్ రెడ్డి పేరు సైకో రెడ్డిగా మారిందన్నారు. దాడులు, హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో ఏపీ బీహార్ తో పోటీపడుతోందని, వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని ఇక్కడి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తు పెట్టుకోవాలని లోకేష్ అన్నారు. త్వరలో ప్రజలే వైసీపీ నాయకుల్ని తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. మాచర్ల దాడి నిందితుణ్ని ఈ సైకోరెడ్డి మున్సిపల్ చైర్మన్ను చేశాడని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.