15ఏళ్లు దాటితే బలవంతంగా పెళ్లి!

N.Hari
అక్కడ ప్రజలకు స్వేచ్ఛలేదు. స్వేచ్ఛ కోల్పోయే స్థితిలో ఉన్నారు. వారి దీన స్థితిని పట్టించుకునేవారే లేరు. అఫ్ఘనిస్తాన్‌లో పదిహేనేళ్లు దాటిన ఆడ పిల్లలు, 45ఏళ్ల లోపు వయస్సు గల వితంతువుల జాబితాను తయారు చేయాలని హుకుం జారీ చేశారు. వారిని తాలిబన్‌ యోధులకు ఇచ్చి పెళ్లి చేస్తారట. అఫ్గనిస్థాన్‌లోని ఇమామ్‌లు, ముల్లాలకు తాలిబన్‌ గ్రూపు సాంస్కృతిక కమిషన్‌ పేరిట వచ్చిన నోట్‌ ఇది.
రెండు దశాబ్దాల అనంతరం అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్‌ నుంచి వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఇది మొదలైందో అప్పటి నుంచే తాలిబన్‌ గ్రూపు తమ విస్తరణ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెమ్మదిగా.. తమ జన్మస్థానమైన కాందహార్‌లోకి ప్రవేశించింది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూనే వరుస దాడులకు పాల్పడుతూ భయోత్పాన్ని సృష్టిస్తోంది. పొగతాగకూడదు, గడ్డం గీసుకోకూడదు, మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదు వంటి ఆంక్షలు పౌరులపై విధిస్తోంది. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తోంది. అయితే, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. టీనేజర్లు, వితంతు మహిళలను సెక్స్‌ బానిసలుగా మార్చి పాకిస్థాన్‌లోని వజిరిస్థాన్‌కు తీసుకువెళ్తామంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
తాలిబన్ల అరాచకంతో తమకు ఎలాంటి రక్షణ ఉండదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వ నియంత్రణలో ఉన్నపుడు కాస్త సంతోషంగా ఉండేవాళ్లం. ఎంతో కొంత స్వేచ్ఛ ఉండేది. ఎప్పుడైతే తాలిబన్లు మళ్లీ ఆరాచకం చేస్తున్నారో.. అప్పటి నుంచి నిరాశ ఆవహించింది. ఇంట్లో ఉన్నా.. గట్టిగా మాట్లాడటానికి వీల్లేదనే అభిప్రాయాలను అక్కడి ప్రజలు తెలియచేస్తున్నారు. మ్యూజిక్‌  వినకూడదు. మార్కెట్లకు స్త్రీలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. ఇప్పుడు వాళ్లు మా కుటుంబ సభ్యుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అమ్మాయిలను ఇంట్లో ఉంచకూడదని, పెళ్లి చేయాలంటూ బెదిరిస్తున్నారు. మరో  రెండు మూడు రోజుల్లో ఇక్కడ బాలికలకు, యువతులకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తారు. మా బతుకులు మారవు" అంటూ  అక్కడ ప్రజలు బోరున విలపిస్తున్నారు. అఫ్ఘనిస్తానులో తాలిబన్ల ఆరాచకంపై "ది సన్‌" ప్రచురించిన ఈ కథనం మానవతావాదులకు కంట తడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: