చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. దీంతోపాటు అనేకమందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. ఇలా బాధపడేవారు ఒక టేబుల్ స్పూన్ గళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో వేసి పొకిలించాలి(గాగ్లింగ్) చెయ్యాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు.
ఒక అరకప్పు వేడిపాలలో అరచెంచా పసుపుపొడిని కలిపి, తీసుకుంటే జలుబు కాస్త తగ్గుతుంది. పండు జిల్లేడు ఆకుల రసములో నూనెను కలిపి శరీరానికి మర్దనా చేయడంతో కాస్త వేడి తగిలి కొంత ఉపశమనం కలుగును. పటికముక్కను తెచ్చి, కాల్చి, నూరి ఈ పొడిని ఒక సీసాలోపెట్టి దాన్ని నిల్వ ఉంచుకోవాలి. జలుబు పట్టిన్పుడు ఈ పొడిని ఒక చిన్న స్పూన్ వేడి వేడి టీతోగాని, వేడి నీటితోగాని రోజుకు మూడుసార్లు తాగితే జలుబు, మీ దరిచేరదు. మిరియాలపొడిని పెరుగును కలిపి తింటుంటే జలుబు తగ్గుతుంది. తులసి ఆకుల రసములో తేనెను కలిపి పుచ్చుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.
నల్లజీలకర్రను దోరగా వేయించి, ఒక చిన్న గుడ్డలో మూటకట్టి వాసనచూస్తే జలుబు తగ్గిపోతుంది. ఒకగ్లాస్ అనాసపండు రసములో ఉప్పు, మిరియాల పొడిని కలిపి, సేవిస్తుంటే సాధారణ జలుబులు తగ్గిపోతాయి. దాల్చిన చెక్క నూనెలో యూకలిప్టస్ నూనెను బాగా కలిపి, ఈ మిశ్రమును గాఢముగా వాసన చూస్తే జలుబు తగ్గుతుంది. గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీ గాని, అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.