సమరానికి సిద్ధం.. అంటున్న సింధు..!!
యావత్ భారతదేశం లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కున్న క్రేజ్ వేరే చెప్పాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన తర్వాత ఆడిన మూడు టోర్నమెంట్లలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన పీవీ సింధు ఇప్పుడు మరో పరీక్షకు రెడి అంటుంది. నేటి నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో ఐదో సీడ్ను లక్ష్యంగా చేసుకొని బరిలోకి దిగనున్న సింధు..,, నేడు జరిగే మహిళా సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి 'మిఛెల్లి' తో ఆడబోతున్నారు.
ఫేస్-ఫేస్ రికార్డులో సింధు 5/2 తో ఆధిక్యంలో ఉండగా.. గతవారం మాత్రం డెన్మార్క్ ఓపెన్లో 17 ఏళ్ల కొరియా అమ్మాయి 'యాన్ సె యంగ్' చేతిలో అనూహ్యంగా ఓడిపోయి ఫ్రెంచ్ ఓపెన్లోనూ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. 'డ్రా’ ప్రకారం సింధుకు క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ కి చెందిన 'సీడ్ తై జు యింగ్', సెమీఫైనల్లో స్పెయిన్కి చెందిన రియో ఒలింపిక్స్ చాంపియన్ 'కరోలినా మారిన్' లేదా జపాన్ కి చెందిన ప్రపంచ మాజీ చాంపియన్స్ 'ఒకుహారా' లేదా థాయిలాండ్ కి చెందిన 'రచనోక్' లతో పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత్ కు చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నేహ్వాల్ బుధవారం జరిగే తొలి రౌండ్లో హాంకాంగ్ కి చెందిన 'చెయుంగ్ ఎన్గాన్ యి' తో ఆడుతున్నారు. పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున శ్రీకాంత్, కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించ దలచుకున్నారు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ఇండోనేషియా కు చెందిన 'సుగియార్తో' తో శుభాంకర్ పోటీ పడతారు. బుధవారం జరిగే ఇతర మ్యాచ్ల్లో చైనీస్ తైపీ కి చెందిన 'రెండో సీడ్ చౌ తియెన్ చెన్' తో శ్రీకాంత్; హాంకాంగ్ కు చెందిన 'ఎన్జీ కా లాంగ్ అంగుస్' తో కశ్యప్; జపాన్ కి చెందిన 'కెంటా నిషిమోటో' తో సమీర్ వర్మ తలపడనున్నట్లు సమాచారం..