యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
టీం ఇండియా డాషింగ్ అల్ రౌండర్, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యువరాజ్ సింగ్ మళ్లీ మైదానంలోకి వచ్చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్-12 సీజన్ మ్యాచ్లు ఆరంభంకానున్నాయి.
వాంఖడే వేదికగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆ జట్టు ఆటగాడు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ సాధన చేస్తుండగా తీసిన వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఐపీఎల్-2019 సీజన్ కోసం గత ఏడాది చివర్లో వేలం నిర్వహించగా కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన యువరాజ్ సింగ్ను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు తొలుత ఆసక్తి చూపలేదు.
ఫస్ట్ రౌండ్లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచిన ఆల్రౌండర్ని వేలం ఆఖర్లో ముంబయి కనీస ధరకే కొనుగోలు చేసింది. యువరాజ్ ప్రాక్టీస్ ను ముంబై ఇండియన్స్ పోస్ట్ చేస్తూ అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. అయితే ఇప్పటికే అభిమానులు ఐపీఎల్ లో యువీ బ్యాటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యువరాజ్ ఐపీఎల్ లో మెరిస్తే వరల్డ్ కప్ లో ఆడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.