భక్తులకు డిసెంబర్ 31 నుండి శబరిమల అయ్యప్పస్వామి వారి దర్శనం

SS Marvels
ఇటీవలే శబరి గిరి వాసుడు శ్రీ అయ్యప్పస్వామి వారి మండల పూజలు ముగియడంతో రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తిరిగి భక్తుల దర్శనార్ధం రేపు డిసెంబర్ 31, గురువారం నాడు తెరవనున్నారు. మకరువిలక్కు పండగ కోసం బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే, భక్తులను మాత్రం డిసెంబరు 31 నుంచి దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొంది. డిసెంబరు 31 ఉదయం నుంచి జనవరి 19 వరకు భక్తులను స్వామి దర్శనం కోసం అనుమతిస్తామని తెలిపింది. జనవరి 20 పడిపూజతో మండల-మకరవిలక్కు సీజన్ ముగుస్తుందని, ఆ రోజే ఆలయాన్ని మూసివేయనున్నట్టు వివరించింది. మకరువిలక్కు పూజలకు ఆన్‌లైన్ బుకింగ్ డిసెంబరు 28న ప్రారంభం కాగా.. ఇప్పటికే దాదాపు అన్ని టిక్కెట్లు అయిపోయాయి. ప్రస్తుతం రోజుకు 5వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయితే, దర్శనం కోసం వచ్చే భక్తులు 48 గంటల ముందే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటానే రావాలని, పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని టీడీబీ సూచించింది. నెగెటివ్ సర్టిఫికెట్ లేకపోతే అనుమతించబోమని స్పష్టం చేసింది.
 



నవంబరు 16న మండల పూజ కోసం అయ్యప్ప సన్నిధానం తెరుచుకోగా.. తొలుత 1,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించారు. కొద్ది రోజులు తర్వాత ఆ సంఖ్యను 2 వేలకు పెంచారు. సాధారణ రోజుల్లో 2 వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 3 వేల మందిని అనుమతించారు. డిసెంబరు 26 నుంచి రోజుకు 5 వేల మంది భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు దర్శనాల సంఖ్యను పెంచినట్టు టీడీబీ పేర్కొంది. భక్తులకు నిలక్కళ్ వద్ద కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సన్నిధానం, పంబ వైద్య శిబిరాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాలకు చెందిన సిబ్బంది, భక్తులకు పరీక్షలు నిర్వహించగా దాదాపు 400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: