ఈ ఉగాది వంటకానికి శతాబ్దాల చరిత్ర.. స్పెషాలిటీ ఇదే
మనదేశంలో ఎన్నో ఆచారాలు.. ఎన్నెన్నో సంప్రదాయాలు ఉంటాయి. ఏ పండగ వచ్చినా ఆ పండగ చేసుకునే మతం వారు ఆచారాలు.. సంప్రదాయాలు తప్పక పాటిస్తారు. అసలు ఈ పండగలు అనేవే మన దేశంలో ప్రతి ఒక్కరిని కలుపుతుంటాయి. ఇక ఒక్కో పండగకు ఒక్కో విధమైన సంప్రదాయాలు.. ఆచారాలు.. వంటలు ఉంటాయి. ఇక ఉగాది పండగకు తెలుగు పండగల్లో ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉగాది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పండగ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అసలు వాస్తవంగా చెప్పాలంటే మన తెలుగోళ్ల జీవితం ఈ ఉగాది నుంచే ప్రారంభ మవుతుంది. నూతన సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1న ప్రారంభమైనా మన తెలుగు సంవత్సరం మాత్రం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ఉగాది రోజు వంటలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా మన జీవితంలో కలిసి పోయాయి. ఉగాదికి అందరి ఇళ్ళలో తప్పని సరిగా పూర్ణం బూరెలు, బొబ్బట్లు చేస్తారు.పుర్ణం బూరెలు లాగే కొత్త సంవత్సరంలో మన జీవితం కూడా సంపూర్ణం గా ఉండాలని అందరూ కోరుకుంటారు.
పూర్ణాలను పశ్చిశనగ పప్పు, బెల్లం, మినపప్పు, బియ్యం ఆయిల్, యాలకుల పోడి.. కొబ్బరి ముక్కలతో తయారు చేస్తారు. ముందుగా మినప్పప్పు, బియ్యం లో నీళ్ళు పోసి నాన బెట్టాలి. ఆ తర్వాత వీటిని రుబ్బాలి. అనంతరం శనగ పప్పు కూడా కడిగి కుక్కర్ లో ఒకటికి రెండు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత శనగపప్పులో బెల్లం కోరి అందులో కొబ్బరి ముక్కలు కలపాలి. ఆ తర్వాత వీటిని ఉండలుగా చేయాలి. అనంతరం వీటిని పొయ్యి మీద మూకిడిలో కాగుతోన్న నూనెలో పోసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేగించి తీయాలి. ఇంతే వేడి వేడి పుర్ణాలు రెడీ.
ఈ పూర్ణాలు మన తెలుగు సంస్కృతిలో కొన్ని ఏళ్ల నుంచి అంతర్భాగంగా ఉన్నాయి. గతంలో పెళ్లిళ్లు చేసేటప్పుడు వీటిని భోజనాల్లో తప్పనిసరిగా పెట్టేవారు. అయితే ఇప్పుడు కొత్త స్వీట్లు పుట్టుక రావడంతో వీటిని చాలా వరకు మర్చిపోయినా సంస్కృతి పాటించే వాళ్లు మాత్రం భోజనాల్లో పెడుతున్నారు.