ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇదే తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. గెలుపు మాది అంటే, మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి జగన్ అద్భుతమైన ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.
ఇంకా పది రోజులే టైం ఉండడంతో నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేయాలనే ఆలోచనతో హెలికాప్టర్ ద్వారా రోజుకు నాలుగు నుంచి ఐదు సభల చొప్పున ప్రచారంలో పాల్గొనే ప్లాన్ చేసుకున్నారు. ఇలా వైసిపి వ్యూహాలతో ముందుకు పోతుంటే వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ టిడిపి కూటమి కూడా దూసుకెళ్తోంది. అయితే రాష్ట్రమంతా ఈ పరిస్థితి ఉంటే ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడ వైసిపి చాలా కీలకంగా మహిళా అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపింది. అంతేకాకుండా ఆ మహిళల చేత ఆ కీలక లీడర్లను ఓడిస్తామని అంటుంది.
ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటయ్యా అంటే.. మంగళగిరి, హిందూపురం, పిఠాపురం. ఇందులో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. ఇక మరో నేత హీరో బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం నుంచి వైసిపి టీజిఎన్ దీపిక బరిలో ఉన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైసిపి నుంచి వంగ గీతాను బరిలో దించారు. రాష్ట్రంలోనే ఈ కీలక నేతలపై మహిళా మణులను పెట్టి విజయం సాధించాలని వైసిపి అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ గీశాడు. ఆ ప్లాన్ ప్రకారమే ఈ నియోజకవర్గాల్లో స్పెషల్ గా బహిరంగ సభలు కూడా నిర్వహించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.