హెరాల్డ్ స్మరామీ : సంఘసంస్కరణోద్యమాన్ని సాగించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు
జీవితాంతం వరకు ఆయన మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసారు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు. మద్యనిషేధం కొరకు శ్రమించాడు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు. 'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.
ఎం.ఏ. కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు. 1904లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు. 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - వేమూరి రామకృష్ణారావు జంటని తప్పకుండా చెప్పుకుంటారు.
1884లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. 1889లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను శ్వేతాంబర ఋషి అనేవారు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు. 1939 మే 26 న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన రఘుపతి వెంకయ్య, నాయుడు సోదరుడే.