పాముల సాయంతో శాస్త్రవేత్తల పరిశోధనలు.. ఎందుకో తెలుసా?
మనుషులకు సోకే వ్యాధులు, వైరస్ ల ఉనికి, ప్రవర్తనా తీరుపై ఎన్నో ప్రయోగాలను శాస్త్రవేత్తలు చేస్తారు. అయితే ఆ ప్రయోగాలను కోతులు, ఎలుకలు లాంటి జీవులపై చేస్తారు. అయితే ఇప్పుడు పరిశోధకులు పాముల సాయంతో సరి కొత్త ప్రయోగాలకు సిద్దమవుతున్నారు. ఏంటి పాముల సాయంతో ప్రయోగాలు ఎలా చేస్తారని ఆశ్చర్యపోవచ్చు కాని అది నిజం. ఉక్రెయిన్లో చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు జరిగి మొత్తం రేడియోషన్ మయం అయింది. ఈ క్రమంలో అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు అనే విషయంపై పాముల సాయం తీసుకోబోతున్నారు సైంటిస్టులు.
33 ఏళ్ల క్రితం 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో కొన్ని సెకన్ల వ్యవధిలోనే పంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది. దీంతో వెలువడిన రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లో, ఆ తర్వాత మరో 19 మంది చనిపోయారు. అలాగే ఫుకుషిమా అనురియాక్టర్ ప్రమాదం వల్ల కలగజేసే నష్టం మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గడ్డి కూడా మొలవని భయంకర పరిస్థితులుంటాయి ఆ ప్రదేశంలో, అలాంటిది జీవుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ ప్రదేశాలలో మనుషుల మనుగడ ఎప్పుడు? అనే కోణంలో శాస్త్రవేత్తలు పాముల సాయంతో పరిశోధనలు చేయనున్నారు.
ఈ అరుదైన పరిశోధనలకు ఫుకుషిమా శాస్త్రవేత్తలు సిద్ధమయినట్లు ‘ఇచ్థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ ఓ కథనం ప్రచురించింది. అయితే పరిశోధకులు పాముల్ని హింసించరు, కేవలం బయోఇండికేటర్లుగా పాములను ఉపయోగించుకుంటారు. మట్టి, గాలి, నీటితో కలిసి ఉండే చెట్లను, జీవ రాశులన్నింటినీ సాధారణంగా బయోఇండికేటర్లుగానే ఉపయోగిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు శాస్త్రవేత్తలు.
అయితే ఇప్పటి వరకు మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు..తొలిసారిగా సర్పాలపై ప్రయోగాలు చేయనున్నారు. పాముల్లో ప్రత్యేకించి జెర్రి పోతు పాములపై ఈ ప్రయోగా చేయనున్నారు. ఎందుకంటే.. ఈ పాములు ఎక్కువ దూరం ప్రయాణించవు, మట్టితో మమేకమై ఉంటూ, దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. ఈ పరిశోధన కోసం ఫుకుషిమా పరిధిలో జీవిస్తున్న 1700 పాములను నిరంతరం పర్యవేక్షించనున్నారు సైంటిస్టులు.