సెటైర్ : 'మా లోకం' లోకి రా చినబాబు..!
ఇప్పుడు కరోనా భయంతో చంద్రబాబు ఇంటి కే పరిమితం అయిపోయారు. ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు కరోనా, ఇప్పుడు వరదలతో జనాలు సతమతం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, హడావుడి చేసే అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా, వదులుకుంటూనే వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయంలోనూ హడావుడి చేస్తూ, ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు లోకేష్ ప్రయత్నించకపోవడం, కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తూ, ఆ సమస్యల పైన ఎక్కువగా స్పందిస్తూ, నాయకత్వ లక్షణాలు తనకు లేవనే విధంగానే ఆయన వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు కు సైతం మింగుడు పడడం లేదట.
ఏపీలో బీజేపీ ఇప్పుడు పరుగులు పెడుతోంది. కొత్త గా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్లే విషయంలో సక్సెస్ అవుతున్నారు. టిడిపి స్థానాన్నిఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో చంద్రబాబు ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశమే లేదు. వయసు రీత్యా ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మేలు. ఈ సమయంలో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని, చంద్రబాబు లోటుని కనిపించకుండా, జనాల్లో తిరగాల్సిన లోకేష్ కరోనా భయం తో ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు సాహసించకపోవడంతో టిడిపి నాయకుల్లో నిరుత్సాహం, లోకేష్ తీరుపైన అసహనం వ్యక్తం అవుతున్నాయి.
వయసు రీత్యా చూసుకున్నా, సోము వీర్రాజు వంటివారు జనాల్లో తిరిగేందుకు ఎటువంటి సంకోచం పడడం లేదు. కానీ యువకుడైన లోకేష్ మాత్రం ఇంటి నుంచి అడుగు పెట్టేందుకు సాహసించకపోవడం, ఆయన రాజకీయ ఎదుగుదలను ఆయనే చేజేతులా నాశనం చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నారు. చినబాబు మా లోకంలోకి రా... ఈ ఆంధ్రా జనాల్లోకి రా !