బిగ్ ట్విస్ట్: అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ? సీబీఐ దర్యాప్తు కారణమా?
రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బాబ్రీ మసీదు తరఫున ప్రధాన కక్షిదారుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇదివరకే ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ ప్యానెల్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
దీనిపై ముస్లిం ప్రతినిధుల తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ ఈ విషయాన్ని తోసిపుచ్చారు. తాము కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున ఇప్పటిదాకా ఎలాంటి అఫిడవిట్ లేదా విజ్ఞప్తులు గానీ తనకు అందలేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ బోర్డు తీసుకునే నిర్ణయమే దీనిపై చివరిదని తేల్చి చెప్పారు.
తుది విచారణలో షాకింగ్ ట్విస్ట్..
భావిస్తోన్న బాబ్రీ మసదు తరఫున ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. హిందూ ధార్మిక సంఘాలైన నిర్మోహి అఖాడా, రామ్ లల్లా విరాజ్ మాన్ వేసిన కేసులతో కలిపి దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. కేసు విచారణకు బుధవారం నాటితో ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కక్షిదారు సున్నీ వక్ఫ్ బోర్డు కేసును వెనక్కి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు మధ్యవర్తిత్వ ప్యానెల్ కమిటీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెల్లడించింది.