సెప్టెంబర్ 1 నుంచి అమలైన కొత్త ట్రాఫిక్ చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయిన కావాల్సినంత ఫైన్ వేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఎలా చెప్పిన ఎంత ఫైన్ వేసిన కొంతమంది వాహనదారులు మాట అస్సలు వినడం లేదు.
అందుకే ప్రజలు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా కర్ణాటకలోని కలబురగి కమిషనరేట్ పరిధిలో పోలీసులు వింత నిర్ణయం తీసుకున్నారు. 'నో హెల్మెట్-నో పెట్రోల్' అనే కొత్త నిబంధన అమల్లోకి తెస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని పెట్రోల్ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసారు ట్రాఫిక్ పోలీసులు.
ఈ విషయంపై పోలీస్ కమిషనర్ ఎంఎన్ నాగరాజ్ మాట్లాడుతూ.. కలబురగి కమిషనరేట్ పరిధిలోని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వారికి పెట్రోల్ బంక్ల్లో పెట్రోల్ ఇవ్వరని అన్నారు. ఈ నిబంధన సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. వాహనదారులను ప్రమాదాల నుంచి తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.