భోరుమని ఏడ్చేసిన మాజీ ఎంఎల్ఏ
పార్టీ మారినందుకు మాజీ
ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) భోరుమని ఏడ్చేశారు. మొన్నటి
ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి నుండి సూరి పోటీ
చేసిన విషయం తెలిసిందే. అయితే వైసిపి అభ్యర్ధి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేతిలో
భారీ తేడాతో సూరి ఓడిపోయారు.
సూరి ఓటమికి వ్యక్తిగతంగా పెరిగిపోయిన వ్యతిరేకతకు తోడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన కసి కూడా ప్రధాన కారణం. అధికారంలో ఉండగా సూరి చేయని అరాచకాలు లేవు. అడ్డుగోలు సంపాదన కోసం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దాంతో నియోజకవర్గంలో చాలామంది ప్రత్యర్ధులు తయారయ్యారు.
ఎప్పుడైతే టిడిపి ఓడిపోయిందో వెంటనే సూరిలో కేసుల భయంతో పాటు ప్రత్యర్ధుల నుండి దాడులను అనుమానిస్తున్నారు. దాంతో టిడిపిలో ఉంటే లాభం లేదనుకుని వెంటనే బిజెపిలో చేరిపోయారు. అంటే కేవలం కేసులు, దాడుల భయం నుండే రక్షణ కోసమే సూరి బిజెపిలో చేరారన్నది వాస్తవం.
అదే విషయాన్ని బిజెపిలో చేరిన తర్వాత ధర్మవరంలో భారీ సమావేశం పెట్టి మద్దతుదారులకు చెప్పారు. వేరే దారిలేకే తాను టిడిపిని వదిలేసి బిజెపిలో చేరినట్లు చెప్పిన సూరి భోరుమన్నారు. నమ్ముకున్న మద్దతుదారులను, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సరే సంస్ధాగతంగా బిజెపికున్న బలమేంటో అందరికీ తెలిసిందే. కాకపోతే బిజెపికి కూడా ఏమాత్రం బలం లేదు కాబట్టే ఇటువంటి వాళ్ళను చేర్చుకుంటోంది.