జ’గన్’ నేడు విద్యాశాఖ పై !
సూటిగా, సుత్తి లేకుండా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విద్యాశాఖ పై దృష్టి సారించనున్నారు. ఉదయం 10.30 విద్యాశాఖ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్, అధికారులు హాజరవుతారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర విద్యా విధానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇటీవల బాగా చర్చనీయాంశమైన అమ్మఒడి పథకం పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పేద పిల్లలు ఏ స్కూలులో చదివినా అమ్మవారి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అయితే ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి కూడా అమ్మవారి పథకం వర్తింపజేస్తే అది ప్రభుత్వ పాఠశాల మనుగడకు ముప్పుగా మారుతుందని ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అమ్మఒడి పథకం తో పాటు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాల పై చర్చ జరగవచ్చు.
ఆరు నెలల్లో ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని ప్రైవేటు కు పోటీగా తయారు చేస్తామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. పాఠశాలల ఫీజుల నియంత్రణ పై కూడా దృష్టి సారిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే విద్యాశాఖ సమావేశం కీలకంగా మారింది. ఈ సమీక్ష సమావేశం తర్వాత జగన్ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కి వెళ్తారు. రాత్రికి హైదరాబాద్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ అవుతారు.