ఆయనకు రాజకీయాలు ఏం తెలుసు. కడప నాయకుడికి రాష్ట్ర పగ్గాలు ఇస్తే. ఇక ప్రజల గతి ఇంతే! తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోచేశాడు.. ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకునేందుకు రెడీ అవుతున్నాడు.. ఆయనకు ఓట్లు వేయకుండా బుద్ధి చెప్పాలి. తరిమి కొట్టాలి- ఏప్రిల్ 9 వరకు ఇలాంటి మాటలే రాష్ట్రంలోని అధికార పక్షంగా ఉన్న టీడీపీ, మరో ప్రతిపక్షంగా ఉన్న జనసేన, వామపక్షాల నాయకుల నుంచి జోరుగా వినిపించాయి. ఎక్కడ విన్నా.. ఎక్కడ కన్నా కూడా జగన్కు వ్యతిరేకంగా ప్రచారం ఇలానే చేశారు.
అయితే, ప్రజలు మాత్రం ఏమనకున్నారో ఏమో.. ఒక్క చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అంతే! సీఎంగా సంతకం చేసి పట్టుమని పది రోజులు కూడా గడవకముం దే.. రాజకీయ ఉద్ధండులను సైతం తలదన్నేలా పాలనలో మెరుపులు కురిపిస్తున్నారు. సీఎంగా సంతకం కూడా చే యకముందుగానే రాష్ట్రాన్ని ఎలా నడిపించదలుచుకున్నదీ జగన్ చెప్పినప్పుడు.. ఇలాంటి మాటలు ఎవరైనా చెబు తారు.. వాస్తవంలోకి వెళ్తేనే కదా.. అసలు రంగు బయట పడుతుంది అని అన్నవారు కూడా ఉన్నారు.
కానీ, ఇప్పుడు పాలనలోకి వచ్చాక.. జగన్ చూపిస్తున్న దూకుడు, వేస్తున్న అడుగులు ఇలాంటి విమర్శకులకు నోరు పెగలకుండా చేస్తున్నాయి. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్.. నా కల అని డబ్బా కొట్టిన చంద్రబాబు కేవలం మాటలకే పరిమితమై.. తమ్ముళ్లు పట్టప గలే లూటీ చేసినా చేతులు కట్టుకుని తన వాటా పంచుకున్నారు. కానీ, అవినీతి ముద్ర వేసిన జగన్ మాత్రం.. అవినీతి అంతు చూస్తానంటూ, చేసిన ప్రకటనకే పరిమితం కాకుండా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అవినీతి ఎక్కడ ఉందో కనిపెట్టడంలోనే ఆయన తొలిఅడుగు విజయవంతం అయింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అంతం చేసే క్రమంలో ఉద్యోగులను సంతృప్తి పరచాలని నిర్ణయించుకున్న జగన్ వారికి అండగా నిలుస్తున్నారు. వారి కోరికలు నెరవేస్తున్నారు. అదే సమయంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. పింఛన్లను పెంచారు. గ్రామ స్వరాజ్యానికి పావులు కదిపారు. కీలక సంస్థలను అప్పుల నుంచి బయటపడేసి ఉద్యోగుల్లో ఆత్మస్థయిర్యం పెంచారు. దీంతో కేవలం పదిరోజుల్లోనే నూటిని నూరు మార్కులు సంపాయించుకుని అప్పుడే ఆయన మంచి ముఖ్యమంత్రి అనిపించుకునే దిశగా దూసుకుపోతున్నారని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అంటున్నారు.